‘జెన్-జీ మన పిల్లలే, నేనే స్వయంగా రాజీనామా ప్రతిపాదన ఇచ్చాను’ – నీట్ వివాదంపై ధర్మేంద్ర ప్రధాన్ స్పందన

NEET-UG పరీక్షల లీకేజీ, అక్రమాలపై దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల ఆందోళనల అనంతరం మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు స్పందించారు. భువనేశ్వర్లోని జిఎమ్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. స్వార్థపూరిత శక్తులు ‘Gen Z’ యువతను తప్పుదోవ పట్టించాయని ఆరోపించారు. మంత్రి పదవి తనకు ఎప్పుడూ ప్రాధాన్యత కాదని, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తానే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి రాజీనామా ప్రతిపాదన ఇచ్చానని స్పష్టం చేశారు.
అలాగే ఒడిశా రాజకీయాల విషయమై బిజెడి అధినేత నవీన్ పట్నాయక్పై విమర్శలు గుప్పిస్తూ, తాను రైతు బిడ్డనని, ‘గో బ్యాక్’ నినాదాలకు భయపడేది లేదని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. దీనిపై బిజెడి నాయకుడు రోహిత్ పూజారి తిప్పికొడుతూ.. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్, నీట్ అవకతవకల వల్ల మనస్తాపానికి గురై అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడటమే ఆయనపై ఆగ్రహానికి కారణమని వ్యాఖ్యానించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా సంబల్పూర్ పోలీసులు సుమారు 30 మంది బిజెడి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.