రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది తెలంగాణలో ఆ రెండు సీట్లు ఎవరివో

దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో 10 రాష్ట్రాలకు చెందిన మొత్తం 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్ను విడుదల చేసింది.
ముఖ్యమైన తేదీలు ఇవే
- నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 26, 2026
- నామినేషన్ల గడువు: మార్చి 05, 2026
- నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 09, 2026
- పోలింగ్ తేదీ: మార్చి 16, 2026 (ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు)
- ఫలితాల ప్రకటన: మార్చి 16, 2026 సాయంత్రం
తెలంగాణలో ఆసక్తికర పోరు
తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కీలక నేతల పదవీ కాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిషేక్ మను సింఘ్వీ పదవీ విరమణ చేయనున్నారు. వీరిద్దరి స్థానాలకు మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ రెండు స్థానాల ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. ఏప్రిల్లో పదవీ విరమణ చేసే సభ్యుల స్థానంలో కొత్తగా ఎన్నికైన వారు సభలోకి అడుగుపెడతారు.