శివరాత్రి రోజు చికెన్ వండలేదని భార్యపై అలిగి విశ్రాంత ఉద్యోగి తీసుకున్న దారుణ నిర్ణయం

మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. శివరాత్రి పర్వదినం పూట మాంసం వండలేదని భార్యతో గొడవపడి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్సింగారం న్యూవెంచర్లో దసరాజుల ప్రకాశ్ (66) అనే విశ్రాంత ఉద్యోగి తన భార్య పద్మతో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 15న శివరాత్రి సందర్భంగా భోజనంలో చికెన్ వండాలని ప్రకాశ్ తన భార్యను కోరారు. అయితే పండుగ రోజు కావడంతో మాంసం వండటం కుదరదని పద్మ ఖరాకండిగా చెప్పింది.
ఈ విషయంలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన పద్మ కాసేపు బయటకు వెళ్లి వచ్చేసరికి, ప్రకాశ్ ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని కనిపించారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన కన్నుమూశారు. మృతుడి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం చికెన్ వండలేదన్న చిన్న కారణంతో నిండు ప్రాణం బలికావడం స్థానికంగా కలకలం రేపింది.