తెలంగాణలో మళ్ళీ ఎన్నికల సందడి.. ఏప్రిల్ 9తో ముగియనున్న కీలక నేతల పదవీకాలం!

మున్సిపల్ ఎన్నికల నగారా తగ్గుముఖం పట్టకముందే తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 16వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు.
తెలంగాణ నుంచి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి (కాంగ్రెస్), కేఆర్ సురేష్ రెడ్డి (బీఆర్ఎస్) పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. వీరితో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో మొత్తం 37 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల కీలక తేదీలు ఇవే..
- నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 26 (గురువారం)
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 5
- నామినేషన్ల పరిశీలన: మార్చి 6
- ఉపసంహరణ గడువు: మార్చి 9
- పోలింగ్ తేదీ: మార్చి 16 (ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు)
- ఓట్ల లెక్కింపు: మార్చి 16 (సాయంత్రం 5 గంటల నుండి)
మొత్తం రెండు విడతల్లో ఈ ప్రక్రియ సాగనుంది. ఏప్రిల్ 2వ తేదీన మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 22 మంది సభ్యులు పదవీ విరమణ చేయనుండగా.. రెండో విడతలో ఏప్రిల్ 9న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, అస్సాం, హర్యానా వంటి రాష్ట్రాలకు చెందిన మరో 15 మంది సభ్యుల పదవీకాలం ముగియనుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్, ఈ రాజ్యసభ ఎన్నికల్లోనూ పట్టు సాధించాలని భావిస్తోంది.