కునో అడవుల్లో కొత్త సందడి.. మూడు చిట్టి చీతాలకు జన్మనిచ్చిన గామిని

మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో ‘ప్రాజెక్ట్ చీతా’ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. గామిని అనే చీతా మూడు కూనలకు జన్మనివ్వడంతో దేశంలో మొత్తం చీతాల సంఖ్య ఇప్పుడు 38కి చేరుకుంది. కేవలం ఈ నెల ప్రారంభంలోనే నమీబియాకు చెందిన ‘ఆశా’ అనే చీతా ఐదు కూనలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వెనువెంటనే మరో చీతా కూడా తల్లి కావడంతో వన్యప్రాణి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భారత్లో అంతరించిపోయిన చీతాల సంతతిని మళ్ళీ పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. 2022లో నమీబియా, 2023లో దక్షిణాఫ్రికా నుంచి చీతాలను భారత్కు తీసుకొచ్చారు. ఈ విజయానికి కృషి చేసిన క్షేత్రస్థాయి సిబ్బందిని మంత్రి భూపేందర్ యాదవ్ అభినందించగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా తన ఆనందాన్ని పంచుకున్నారు. మన అడవుల్లో చీతాల సంఖ్య పెరుగుతుండటం పర్యావరణ సమతుల్యతకు శుభసూచకమని అధికారులు భావిస్తున్నారు.