మాజీ మంత్రి అంబటి రాంబాబుకు భారీ ఊరట.. లక్కీ డ్రా కేసులో కోర్టు కీలక తీర్పు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. సత్తెనపల్లి లక్కీ డ్రా కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు గుంటూరు జిల్లా కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసు విచారణలో భాగంగా అంబటి రాంబాబును కస్టడీకి అప్పగించాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను విచారించేందుకు కస్టడీ అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. అంబటి తరపు న్యాయవాదులు సమర్పించిన వాదనలతో ఏకీభవించిన కోర్టు, ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
సత్తెనపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా లక్కీ డ్రా నిర్వహించారనే ఆరోపణలతో అరెస్టయిన అంబటి రాంబాబు, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు అందిన వెంటనే, అధికారిక ప్రక్రియ పూర్తి చేసుకుని ఆయన విడుదల కానున్నారు.