అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఒక ప్రమాదకరమైన ఉచ్చు, తీవ్రస్థాయిలో మండిపడ్డ మల్లికార్జున ఖర్గే

అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక ‘ఉచ్చు’గా అభివర్ణిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రష్యా నుండి చమురు దిగుమతులను నిలిపివేయాలనే షరతుకు అంగీకరించడం ద్వారా భారత్ తన సార్వభౌమత్వాన్ని పణంగా పెడుతోందని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయం దేశ ప్రయోజనాలకు భిన్నంగా ఉందని, దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత్ బలహీనపడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, జెనెటికల్లీ మోడిఫైడ్ (జీఎం) ఫీడ్ మరియు పప్పుధాన్యాల దిగుమతికి అంగీకరించడం భారతీయ రైతులకు చేస్తున్న తీరని అన్యాయమని ఖర్గే పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల మన దేశ వస్త్ర ఎగుమతులకు లభించాల్సిన ప్రాధాన్యత తగ్గి, బంగ్లాదేశ్కు ఎక్కువ ప్రయోజనం చేకూరేలా ఉందని ఆయన విమర్శించారు. రైతుల ప్రయోజనాలను విస్మరించి, పొరుగు దేశానికి మేలు చేసేలా ఉన్న ఈ ఒప్పందం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.