5.2 కేజీల శిశువుకు జన్మనిచ్చిన తల్లి, అసాధారణ బరువు చూసి వైద్యులు షాక్

అస్సాంలోని కచార్ జిల్లాలో 27 ఏళ్ల జయతీ దాస్ అనే మహిళ 5.2 కిలోల బరువున్న అరుదైన శిశువుకు జన్మనిచ్చారు. సాధారణంగా నవజాత శిశువుల బరువు 2.5 నుండి 3.5 కిలోల మధ్య ఉంటుంది. కాగా, ఈ బరువు చాలా అసాధారణం. ఈ ఘటన కుటుంబ సభ్యులతో పాటు వైద్యులను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. జూన్ 17న ప్రసవ వేదనతో ఆమె సతీంద్ర మోహన్ దేవ్ సివిల్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు ఇది రెండవ సంతానం.
వైద్యులు హనీఫ్ మాట్లాడుతూ, ఇది ఆలస్యంగా వచ్చిన ప్రసవ కేసు. మే 29న ఆసుపత్రిలో చేరాలని సూచించినా, ఆమె ఆలస్యంగా వచ్చారని తెలిపారు. మంగళవారం అత్యవసరంగా ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ తర్వాత శిశువు బరువు 5.2 కిలోలు ఉండడం చూసి వైద్యులు షాక్ అయ్యారు. ఇంతటి భారీ శిశువును ఇంతకు ముందు చూడలేదని వైద్యులు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధృవీకరించారు.