రోహిత్, విరాట్ జీతాల్లో భారీ కోత, బీసీసీఐ కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటన

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమ్ ఇండియా ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ విధానంలో కీలక మార్పులు చేసింది. గతంలో ఉన్న ఏ+ (A+) గ్రేడ్ను పూర్తిగా రద్దు చేసిన బోర్డు, ఆటగాళ్లను మూడు విభాగాల్లోకి చేర్చింది. కొత్త నిబంధనల ప్రకారం, గ్రేడ్-ఏ లోని ఆటగాళ్లకు ఏడాదికి 5 కోట్ల రూపాయలు, గ్రేడ్-బి ఆటగాళ్లకు 3 కోట్ల రూపాయలు, గ్రేడ్-సీ లోని ఆటగాళ్లకు 1 కోటి రూపాయల వేతనం లభిస్తుంది. ఈ వార్షిక వేతనంతో పాటు ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు అదనంగా అందుతాయని బోర్డు స్పష్టం చేసింది.
అయితే తాజా కాంట్రాక్టులో స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు గ్రేడ్-బి కేటాయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనివల్ల వారు ఏడాదికి 3 కోట్ల రూపాయల వేతనాన్ని అందుకోనున్నారు. గ్రేడ్ల వర్గీకరణలో జరిగిన ఈ మార్పులు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత ప్రదర్శనలను ప్రామాణికంగా తీసుకుని బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల క్రమశిక్షణ, నిలకడైన ప్రదర్శనే లక్ష్యంగా బీసీసీఐ ఈ కొత్త ఒప్పందాలను ఖరారు చేసింది.