మాటలు లేవు కేవలం ఈలలతోనే పలకరింపులు, మేఘాలయలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా

భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం, అందుకు మేఘాలయలోని కాంగ్థాంగ్ గ్రామం ఒక అద్భుత నిదర్శనం. ఈ గ్రామాన్ని ప్రపంచవ్యాప్తంగా ‘విజ్లింగ్ విలేజ్’ అని పిలుస్తారు. ఇక్కడి ఖాశీ తెగకు చెందిన ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సాధారణ భాషకు బదులుగా ఈలలను ఉపయోగిస్తారు. ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డకు తల్లి ఒక ప్రత్యేకమైన ఈల లేదా రాగాన్ని బహుమతిగా ఇస్తుంది, అదే ఆ వ్యక్తికి జీవితాంతం ఒక గుర్తింపుగా మారుతుంది.
ఎవరినైనా పిలవాలన్నా లేదా ఏదైనా సమాచారం అందించాలన్నా ఇక్కడ గ్రామస్తులు పేరు పెట్టి పిలవకుండా ఆ ప్రత్యేక రాగంతో ఈల వేస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఎదుటి వ్యక్తి ఆ శబ్దాన్ని బట్టి తన్నే పిలుస్తున్నారని సులభంగా అర్థం చేసుకుంటారు. ప్రకృతి ఒడిలో సాగే ఈ అపురూప సాంప్రదాయం భారతదేశ ప్రాచీన సంస్కృతికి అద్దం పడుతోంది. ఆధునిక ప్రపంచంలో భాషా సరిహద్దులు దాటి కేవలం శబ్దంతోనే భావ వ్యక్తీకరణ చేసే ఈ గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.