బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. మరణించిన వారి కుటుంబాలకు 15 రోజుల్లోనే రూ. 15 లక్షల క్లెయిమ్

చెన్నై: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) తమ ఖాతాదారుల కుటుంబాల కోసం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అత్యంత సున్నితమైన సమయంలో మరణించిన కస్టమర్ల వారసులకు అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా ‘ఆన్లైన్ డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ పోర్టల్’ను అందుబాటులోకి తెచ్చింది.
డిజిటల్ విధానంలో సులభంగా క్లెయిమ్
సాధారణంగా బ్యాంకుల్లో డెత్ క్లెయిమ్ పొందాలంటే నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. కానీ ఐఓబీ తెచ్చిన ఈ కొత్త పోర్టల్ ద్వారా ఇకపై ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోర్టల్ లో మరణించిన వ్యక్తి వివరాలు, ఖాతా సమాచారం నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మీ అప్లికేషన్ ఏ దశలో ఉందో కూడా రియల్-టైమ్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు.
రూ. 15 లక్షల వరకు ప్రత్యేక మినహాయింపు
బాధిత కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు రూ. 15 లక్షల వరకు ఉన్న క్లెయిమ్లకు బ్యాంక్ భారీ ఊరటనిచ్చింది. ఈ మొత్తం వరకు ఎటువంటి థర్డ్ పార్టీ షూరిటీ అవసరం లేకుండానే క్లెయిమ్ సెటిల్ చేస్తారు. అంతేకాకుండా, దరఖాస్తు చేసిన 15 రోజుల లోపే పూర్తి ప్రక్రియ ముగించి డబ్బులు అందజేస్తామని బ్యాంక్ హామీ ఇస్తోంది.
కొత్త వెబ్సైట్ ప్రారంభం
ఈ సేవలతో పాటు ఐఓబీ తన కార్పొరేట్ వెబ్సైట్ను కూడా సరికొత్తగా తీర్చిదిద్దింది. లైఫరే డిజిటల్ ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్ ఆధారంగా రూపొందించిన ఈ సైట్ వినియోగదారులకు మరింత సులభమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తుంది. సాంకేతికతకు మానవీయ కోణాన్ని జోడించి, కష్టకాలంలో కస్టమర్ల కుటుంబాలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని బ్యాంక్ పేర్కొంది.
క్లెయిమ్ కోసం కావాల్సిన పత్రాలు:
- మున్సిపాలిటీ లేదా పంచాయతీ జారీ చేసిన డెత్ సర్టిఫికేట్.
- మరణించిన వారి బ్యాంక్ పాస్బుక్ లేదా ఖాతా వివరాలు.
- నామినీ లేదా వారసుల ఐడీ కార్డులు, అడ్రస్ ప్రూఫ్.
- నామినీ లేని పక్షంలో లీగల్ హెయిర్ సర్టిఫికేట్.
ఈ కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా నామినీలు ఉన్న ఖాతాదారుల కుటుంబాలకు ప్రక్రియ అత్యంత వేగంగా పూర్తి కానుంది. బ్యాంకింగ్ రంగంలో ఐఓబీ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర బ్యాంకులకు ఆదర్శంగా నిలుస్తోంది.