పాకిస్థాన్కు చుక్కలు చూపించనున్న భారత్.. ఇక గుక్కెడు నీటి కోసం అలమటించాల్సిందే!

పాకిస్థాన్కు భారత్ మరో గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఇప్పటికే సింధు జలాల ఒప్పందంపై కఠినంగా ఉన్న భారత్, ఇప్పుడు రావి నది నీటిని పూర్తిగా అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. రాబోయే వేసవిలో పాకిస్థాన్కు నీటి సెగ తగిలేలా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోని షాపూర్ కండి ఆనకట్ట పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.
ఐదు దశాబ్దాల నిరీక్షణకు తెర
సుమారు 1979లో రూపకల్పన జరిగి, 1982లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పునాది రాయి వేసిన ఈ ప్రాజెక్ట్, అంతర్గత వివాదాల వల్ల దశాబ్దాలుగా నత్తనడకన సాగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి రూ. 3,394.49 కోట్ల వ్యయంతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. మార్చి 31 నాటికి ఈ పనులు ముగియనున్నట్లు జమ్మూ కాశ్మీర్ మంత్రి జావేద్ అహ్మద్ రాణా స్పష్టం చేశారు.
పాక్కు వెళ్లే నీరు కట్.. మన రైతులకు పండుగ
ప్రస్తుతం రావి నది నుండి మాధోపూర్ మీదుగా పాకిస్థాన్లోకి వృథాగా వెళ్తున్న అదనపు జలాలను భారత్ నిలిపివేయనుంది. ఈ నీటిని జమ్మూ కాశ్మీర్లోని కరువు పీడిత ప్రాంతాలైన కథువా, సాంబా జిల్లాలకు మళ్లించనున్నారు.
ప్రాజెక్టు ప్రత్యేకతలు
- సాగునీరు: పంజాబ్లో 5,000 హెక్టార్లు, జమ్మూ కాశ్మీర్లో 32,173 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది.
- నిర్మాణం: 55.5 మీటర్ల ఎత్తు, 7.7 కిలోమీటర్ల పొడవైన హైడల్ ఛానల్తో ఈ ఆనకట్టను నిర్మించారు.
- ఆర్ధిక వాటా: పంజాబ్ ప్రభుత్వం 80 శాతం (రూ. 2,694 కోట్లు), కేంద్ర ప్రభుత్వం 20 శాతం (రూ. 700 కోట్లు) నిధులను సమకూర్చాయి.
సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్కు, ఈ నీటి మళ్లింపు నిర్ణయం కోలుకోలేని దెబ్బ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మన నీరు మన హక్కు అన్న నినాదంతో భారత్ వేస్తున్న ఈ అడుగు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.