తిరుమల శ్రీవారి దర్శనం క్యూలైన్లో భక్తురాలిని కాటేసిన పాము
February 23, 2026

తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశం క్యూలైన్లో వేచి ఉన్న ఓ మహిళా భక్తురాలిని పాము కాటేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆదివారం రాత్రి తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన 27 ఏళ్ల మౌనిక దర్శనం కోసం క్యూలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో తోటి భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న టీటీడీ సిబ్బంది వెంటనే స్పందించి బాధితురాలిని అశ్విని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్పించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో భక్తుల రక్షణ కోసం క్యూలైన్ల వద్ద మరింత అప్రమత్తత అవసరమని భక్తులు కోరుతున్నారు.