చట్టసభలకు రాకుండా జీతాలా? ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒకవైపు శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు జరుగుతుంటే, మరోవైపు అసెంబ్లీలో వైసీపీ సభ్యుల గైర్హాజరుపై స్పీకర్ చింతామనేని అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సభకు హాజరుకాకుండా ప్రజాధనాన్ని జీతాల రూపంలో తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
రీకాల్ చట్టం రావాలి.. స్పీకర్ డిమాండ్ అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా సభకు హాజరుకావాలని స్పష్టం చేశారు. ప్రపంచంలోని ఎనిమిది దేశాల్లో అమల్లో ఉన్న ‘రైట్ టు రీకాల్’ (ప్రజలే తమ ప్రతినిధిని వెనక్కి పిలిచే హక్కు) పద్ధతి మన దేశంలో కూడా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సభకు రాని పక్షంలో వారి సభ్యత్వాన్ని రద్దు చేసేలా కఠిన నిబంధనలు ఉండాలని అభిప్రాయపడ్డారు. గత బడ్జెట్ సమావేశాల నుంచే ఆయన ఇదే వాదనను వినిపిస్తున్నారు.
ఏఐ అటెండెన్స్.. ఎమ్మెల్యేల గుట్టు రట్టు సభలో సభ్యుల క్రమశిక్షణను పర్యవేక్షించేందుకు ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అటెండెన్స్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తోందని స్పీకర్ తెలిపారు. ఎవరు ఎప్పుడు వస్తున్నారు, ఎంత సమయం సభలో గడుపుతున్నారు అనే అంశాలు పక్కాగా రికార్డ్ అవుతున్నాయన్నారు. అయితే, కేవలం ప్రతిపక్షాలనే కాకుండా, కూటమి ఎమ్మెల్యేల తీరును కూడా ఆయన తప్పుబట్టారు. సభలో పట్టుమని పది నిమిషాలు కూడా కూర్చోకుండా లాబీల్లో కబుర్లు చెప్పుకుంటూ, మీడియాతో చిట్చాట్లు చేస్తున్న సభ్యులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండలి దారిలో అసెంబ్లీ ఎందుకు లేదు? ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తూ, ప్రజా సమస్యలపై చర్చిస్తూ అసలైన ప్రజాస్వామ్య వేదికను తలపిస్తున్నారు. ఇదే స్ఫూర్తిని అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు చూపడం లేదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశం పక్కన పెడితే, కనీసం ప్రజా సమస్యలపై గొంతు వినిపించేందుకు సభకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
బహిష్కరణ కంటే పోరాటమే మిన్న వైసీపీ సభ్యులు సభను బహిష్కరించడం వల్ల ప్రభుత్వ తీరును ఎండగట్టే అవకాశం కోల్పోతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సభకు వచ్చి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే, అప్పుడు నిరసన తెలిపి బయటకు వస్తే ప్రజల్లో మైలేజ్ ఉంటుందని, అలా కాకుండా ముందే ఊహించుకుని గైర్హాజరు కావడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడుతున్నారు. ఇంకా 15 రోజుల పాటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, ఇప్పటికైనా వైసీపీ నేతలు మనసు మార్చుకుని సభకు హాజరవుతారా అనేది వేచి చూడాలి.