ఖమేనీ సంచలన నిర్ణయం, 37 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలకడంతో యుద్ధ భయం

ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ఒక ముఖ్యమైన సంప్రదాయాన్ని అకస్మాత్తుగా విరమించుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 1989లో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఖమేనీ ప్రతి ఏటా ఫిబ్రవరి 8న వైమానిక దళ కమాండర్లతో సమావేశమయ్యేవారు. అయితే, గత 37 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆయన ఆ సమావేశానికి హాజరు కాలేదు. 1979 విప్లవ సమయంలో మాజీ నేత రుహోల్లా ఖొమేనీకి వైమానిక దళం ప్రకటించిన విధేయతకు గుర్తుగా ఈ వార్షిక వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
అమెరికాతో యుద్ధం సంభవించవచ్చనే భయాందోళనల మధ్యే ఖమేనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదించింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో భద్రతా కారణాల దృష్ట్యా లేదా వ్యూహాత్మక మార్పుల వల్ల ఆయన ఈ కీలక భేటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఈ ఆచారాన్ని ఖమేనీ పక్కన పెట్టడం ఇరాన్ రాజకీయాల్లో మరియు సైనిక వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఈ పరిణామం ఇరాన్ తదుపరి అడుగుల పై ప్రపంచ దేశాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.