SCల విషయంలో జగన్ మడమ తిప్పారు: మందకృష్ణ

ఆంధ్రప్రదేశ్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన SC వర్గీకరణ విషయంలో మాట తప్పారని, గతంలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు SC వర్గీకరణపై తన మాట నిలబెట్టుకున్నారని గుర్తుచేస్తూ, జగన్ మాత్రం తొలుత మద్దతుగా సంతకం చేసి తరువాత యూటర్న్ తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
మాలల ఆధిపత్యం పెంచేందుకు మాదిగలను వైఎస్ జగన్ ఉద్దేశపూర్వకంగా అణగదొక్కుతున్నారని మందకృష్ణ మండిపడ్డారు. YCP ప్రభుత్వంలో మాదిగలకు సమాన హక్కులు లభించకుండా కక్షసాధింపు విధానం పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివక్షను తాము సహించబోమని, మాదిగల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. SC వర్గీకరణను న్యాయబద్ధంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ, ఇందుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.