RCB బౌలింగ్ బాగుందనడం సంతోషం: మాల్యా

IPL 2025 తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడంతో ఆ జట్టు మాజీ ఓనర్ విజయ్ మాల్యా హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, “ఎట్టకేలకు ఆర్సీబీ బౌలింగ్ బాగా చేసిందని కామెంటేటర్లు చెప్పడం ఆనందంగా ఉంది. ఇక బ్యాటింగ్ లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తే అర్థం అవుతోంది” అని వ్యాఖ్యానించారు. మాల్యా ఈ వ్యాఖ్యలు చేయగానే ఆర్సీబీ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల మెప్పుపొందిన ఆర్సీబీ బ్యాటింగ్ విభాగం ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచింది. కానీ గత సీజన్లలో ప్రధానమైన సమస్యగా నిలిచిన బౌలింగ్ విభాగం ఈసారి మెరుగైన ప్రదర్శన చూపించడం గమనార్హం. ఇదే విషయాన్ని మాల్యా కూడా హైలైట్ చేయడం విశేషం. కాగా, బ్యాంకులకు భారీగా రుణ బకాయిలు ఉన్న నేపథ్యంలో మాల్యా దేశం విడిచి UKకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.