‘మాది జీరో.. ఖర్చంతా మీదే’.. ఉక్రెయిన్కు ట్రంప్ షాక్

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన రెండవ దఫా పాలనలో వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవి కొన్ని దేశాలకు షాకిస్తున్నాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఉక్రెయిన్కు పిడుగుపాటులా మారింది.
ట్రంప్ తన తాజా ప్రకటనలో ఉక్రెయిన్కు నూతన ఆయుధాలు సమకూర్చేందుకు అమెరికా ‘జీరో డాలర్లు’ ఖర్చు చేస్తుందని, అందుకు అయ్యే ఆర్థిక భారాన్ని యూరోపియన్ యూనియన్(ఈయూ) మోయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్కు రాబోయే కాలంలో పంపించే ఆయుధాల బిల్లును అమెరికా భరించబోదని, ఆ ఆర్థిక బాధ్యత ఇప్పుడు యూరోపియన్ యూనియన్పైనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇందుకోసం మేము జీరో డాలర్లు ఖర్చు చేస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 2022లో రష్యా దండయాత్రను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు సైనిక, మానవతా సహాయాలను అందించడంలో అమెరికా కీలకపాత్ర పోషించింది. అయితే ఇకపై అలాంటి సహాయం అందబోదని ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు.
యూరోపియన్ దేశాలు ప్రాంతీయ భద్రతను పరిపుష్టం చేసేందుకు మరింతగా సాయం అందించాలని అమెరికాను కోరిన దరిమిలా అధ్యక్షుడు ట్రంప్ తన దీర్ఘకాల వైఖరిని వెల్లడించారు. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న నిరంతర దాడిపై స్పందించిన ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నారని సమాచారం. కాగా ట్రంప్ తాజా ప్రకటన కొత్త చర్చకు దారితీసింది. తన ప్రత్యర్థి రష్యా దురాక్రమణను ఎదుర్కొనేందుకు అమెరికా సైనిక మద్దతుపై ఎక్కువగా ఆధారపడుతున్న ఉక్రెయిన్కు ఇది పిడుగుపాటులా పరిణమించింది. అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై యూరోపియన్ యూనియన్ ఇంకా స్పందించలేదు.