BREAKING: 357 బెట్టింగ్ సైట్స్ బ్లాక్

ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ వెబ్సైట్లపై కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (DGGI) పెద్దయెత్తున చర్యలు చేపట్టింది. పన్ను ఎగ్గొట్టడం, అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్న 357 వెబ్సైట్లను బ్లాక్ చేసింది. అంతేకాదు, ఈ సంస్థలకు చెందిన 2,400 బ్యాంక్ ఖాతాలను గుర్తించి, అందులో ఉన్న మొత్తం రూ.126 కోట్లు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం దాదాపు 700 విదేశీ సంస్థలు భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి కార్యకలాపాలను నడుపుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ సంస్థలు భారతీయ వినియోగదారులను ఆకర్షించి, పన్నుల నుంచి తప్పించుకుంటున్నట్లు గుర్తించారు. ప్రజలు ఇలాంటి అక్రమ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తమ డబ్బును పొగొట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం ఈ విధమైన బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.