ఓఆర్ఆర్ పై లంచ్ చేస్తుండగా మృత్యుపాశం కంటైనర్ లారీ బీభత్సంలో ఇద్దరి దుర్మరణం

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా శామీర్పేట్ వద్ద గల ఔటర్ రింగ్ రోడ్పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన కారు ఆపి భోజనం చేస్తున్న కొందరు వ్యక్తులపైకి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
శామీర్పేట్ ఎగ్జిట్-7 వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న వారు మధ్యాహ్న భోజన సమయం కావడంతో వాహనాన్ని పక్కకు నిలిపి తింటుండగా, వెనుక నుంచి వచ్చిన భారీ కంటైనర్ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కంటైనర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతి వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ఇటువంటి ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి