పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు 5500 విమానాలు రద్దు

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ సంక్షోభం కారణంగా ఇప్పటివరకు 5,500 కంటే ఎక్కువ విమాన సర్వీసులు రద్దయినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఆయన ఈ కీలక గణాంకాలను ప్రకటించారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో గగనతలం మూసివేయడం వల్ల విమానాల రద్దు తప్పనిసరి అయిందని ఆయన పేర్కొన్నారు.
మొత్తం రద్దయిన 5,522 విమానాలలో భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 4,335 సర్వీసులు, విదేశీ సంస్థలకు చెందిన 1,187 సర్వీసులు ఉన్నాయని మంత్రి వివరించారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని, అందుకే యుద్ధ ప్రాంతాల్లో విమాన రాకపోకలను నిలిపివేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇంతటి ఉద్రిక్తతల మధ్య కూడా సుమారు 2,19,780 మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను కొనసాగించగలిగారని ఆయన తెలిపారు. డీజీసీఏ (DGCA) నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తోందని, గగనతలం పునరుద్ధరించిన తర్వాతే విమాన సేవలు సాధారణ స్థితికి వస్తాయని చెప్పారు.
మరోవైపు, దేశీయ విమానయాన రంగంలో మహిళా పైలట్ల ప్రాతినిధ్యంపై కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహన్ లోక్సభలో కీలక వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన విమానయాన సంస్థల్లో మొత్తం 11,394 మంది పైలట్లు పనిచేస్తుండగా, వారిలో 1,871 మంది మహిళా పైలట్లు ఉన్నారని ఆయన తెలిపారు. విమానయాన రంగంలో మహిళల సంఖ్య పెరుగుతుండటం సానుకూల పరిణామమని ప్రభుత్వం పేర్కొంది. యుద్ధం ముగిసి పరిస్థితులు చక్కబడిన తర్వాతే అంతర్జాతీయ సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.