అమరజీవి త్యాగానికి చిహ్నంగా 58 అడుగుల విగ్రహం ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మార్గదర్శి పొట్టి శ్రీరాములు అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తెలుగు జాతి అస్తిత్వం కోసం శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని స్మరించుకున్నారు. ఆయన 58 రోజుల పాటు చేసిన నిరాహార దీక్షకు గుర్తుగా, ఈ విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తులో నిర్మించినట్లు వెల్లడించారు.
పొట్టి శ్రీరాములు త్యాగాన్ని చిరస్మరణీయం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జల జీవన్ మిషన్’కు ‘అమరజీవి జలధార’గా నామకరణం చేసినట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నీటిని తాగే ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములును గుర్తుంచుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో 7 భారీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నీ ‘అమరజీవి జలధార’ పేరుతోనే కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడికి ఇది నిజమైన నివాళి అని పవన్ కళ్యాణ్ కొనియాడారు.