లంచం ఫోన్ పే చేసినా పని చేయడం లేదు సార్ గ్రీవెన్స్లో బాధితుడి వినూత్న ఫిర్యాదు

అడిగినంత లంచం ఇచ్చినా తన పని చేయడం లేదంటూ ఒక వ్యక్తి నేరుగా జిల్లా కలెక్టరేట్లోనే ఫిర్యాదు చేయడం ఇప్పుడు జగిత్యాల జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కరీంనగర్కు చెందిన వంకాయల మహేశ్వర్ అనే వ్యక్తి ఈ విలక్షణమైన ఫిర్యాదును అధికారుల ముందు ఉంచారు. డిజిటల్ పేమెంట్ ద్వారా లంచం ఇచ్చినా న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా సహకార కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కోడూరు హరీష్పై మహేశ్వర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన పని పూర్తి చేస్తానని నమ్మబలికిన హరీష్, అందుకోసం 11,100 రూపాయలను లంచంగా డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. బాధితుడు ఆ మొత్తాన్ని సదరు అధికారికి ఫోన్ పే ద్వారా పంపినట్లు ఆధారాలతో సహా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. డబ్బులు తీసుకున్న తర్వాత కూడా పని చేయకపోగా, నిలదీస్తే కులం పేరుతో దూషించాడని బాధితుడు ఆరోపించారు.
సాధారణంగా లంచం అడిగితే ఏసీబీని ఆశ్రయించాల్సిన బాధితుడు, ముందుగా డబ్బులు చెల్లించి పని కాకపోవడంతో ప్రజావాణికి రావడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన అద్దం పడుతోంది. ఫోన్ పే ద్వారా లంచం తీసుకున్నారనే అంశంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది.