బెంగాల్ ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం సీఎస్ మరియు హోం సెక్రటరీలపై వేటు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కొద్ది గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత పదవుల్లో ఉన్న చీఫ్ సెక్రటరీ (సీఎస్), హోం సెక్రటరీలను తక్షణమే విధుల్లో నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ భారీ మార్పులు చేపట్టినట్లు ఈసీ స్పష్టం చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రస్తుత సీఎస్ నందిని చక్రవర్తి, హోం సెక్రటరీ జగదీష్ ప్రసాద్ మీనాలను బదిలీ చేస్తూ వారి స్థానంలో కొత్త అధికారులను నియమించారు. 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దుష్యంత్ నరియాలాను కొత్త చీఫ్ సెక్రటరీగా, 1997 బ్యాచ్కు చెందిన సంఘమిత్ర ఘోష్ను కొత్త హోం సెక్రటరీగా ఈసీ ఎంపిక చేసింది. వీరు సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోపు బాధ్యతలు స్వీకరించి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
బదిలీ అయిన అధికారులకు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి ఎన్నికల సంబంధిత విధులను అప్పగించకూడదని ఈసీ కఠిన నిబంధనలు విధించింది. బెంగాల్లో ఏప్రిల్ 23 మరియు 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైన వెంటనే మమతా బెనర్జీ ప్రభుత్వంలోని కీలక అధికారులపై ఈసీ వేటు వేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.