అడ్వకేట్లు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు: మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్రంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నూతన కోర్టు భవనాల నిర్మాణానికి రూ.1000 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, నూతన హైకోర్టుతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాల నిర్మాణానికి రూ.2,600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
శాసనమండలిలో ‘అడ్వకేట్లు, గుమాస్తాల సంక్షేమ చట్టం సవరణ బిల్లు-2025’ను ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని న్యాయవాదులకు సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ క్రమంలో, అడ్వకేట్లు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు జారీ చేయడంతో పాటు ప్రమాద బీమా కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమాన్ని కాంక్షిస్తుందని, వారి హక్కులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.