ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతి, నెతన్యాహు సంచలన ప్రకటన

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడిలో ఇరాన్కు చెందిన ఒక అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు ధృవీకరించారు. గురువారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ దాడిలో మరొక అణు శాస్త్రవేత్త కూడా ప్రాణాలు కోల్పోయారని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. ఈ పరిణామం అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది.
ఈ సందర్భంగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీపై నెతన్యాహు తీవ్ర విమర్శలు గుప్పించారు. మోజ్తబాను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ చేతిలో ఒక ‘కీలుబొమ్మ’గా ఆయన అభివర్ణించారు. మోజ్తబా ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కనిపించలేదని నెతన్యాహు ఎద్దేవా చేశారు. ఇరాన్ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆయన హెచ్చరించారు.
ఇదే సమయంలో ఇరాన్ ప్రజలకు నెతన్యాహు ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. “స్వేచ్ఛా మార్గంలో పయనించాల్సిన సమయం వచ్చింది, ఇజ్రాయెల్ మీకు అండగా ఉంటుంది” అని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిదీ ఇరాన్ ప్రజల చేతుల్లోనే ఉందని, మార్పు దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది.