రీల్స్ పిచ్చితో నిండు ప్రాణం బలి.. ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో తండ్రి సంచలన క్షమాపణలు

ఢిల్లీలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కేవలం 17 ఏళ్ల మైనర్ బాలుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా స్కార్పియో కారును అతివేగంగా నడిపి, 23 ఏళ్ల సాహిల్ ధనేశ్రా అనే యువకుడి మృతికి కారణమయ్యాడు. ఈ విషాద ఘటనపై నిందితుడి తండ్రి తాజాగా స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
తన కుమారుడు చేసిన తప్పుకు ఒక తండ్రిగా తాను తలదించుకుంటున్నానని, మృతుడి కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 3న ద్వారక ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో సాహిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒక టాక్సీ డ్రైవర్ కూడా గాయపడ్డారు.
అయితే ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు మరీ భయంకరంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ‘ఫన్ రీల్స్’ చేయడం కోసమే నిందితుడు తన సోదరితో కలిసి రాంగ్ లేన్లో కారును అతివేగంగా నడిపాడని మృతుడి తల్లి ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను ఊరిలో లేనని, తన ప్రమేయం లేకుండానే కొడుకు కారు తాళాలు తీసుకున్నాడని నిందితుడి తండ్రి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం నిందితుడైన మైనర్ బాలుడిని పోలీసులు అబ్జర్వేషన్ హోమ్కు తరలించి విచారణ జరుపుతున్నారు.