చిత్తూరు జిల్లాలో దారుణం.. చిన్నారిపై పైశాచికం తర్వాత నిందితుడు ఏం చేశాడో తెలుసా

మదనపల్లెలో కలకలం రేపిన ఏడేళ్ల బాలిక హత్యోదంతం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. తన ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై పొరుగునే ఉండే కులవర్ధన్ అనే వ్యక్తి కన్నేశాడు. పసిపాప అని కూడా చూడకుండా ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, గొంతు కోసి కిరాతకంగా చంపేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ప్లాస్టిక్ వాటర్ డ్రమ్లో దాచిపెట్టాడు.
బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో నిందితుడి ఇంట్లోనే మృతదేహం లభ్యమైంది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు కులవర్ధన్ మంగళవారం రాత్రి మదనపల్లెలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును పోక్సో చట్టం కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు నిందితుడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.