నర్మదా నదిపై నడుస్తున్న వృద్ధురాలు, దైవంగా భావించి పూజలు చేసిన జనం కానీ అసలు నిజం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నర్మదా నది నీటిపై ఒక వృద్ధురాలు నడుస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇది చూసిన స్థానికులు ఆమెను సాక్షాత్తూ ఆ నర్మదా మాత స్వరూపంగా భావించి నది వద్దకు భారీగా తరలివచ్చారు. కొందరు ఆమెకు పూజలు చేయడం ప్రారంభించగా, మరికొందరు ఆమె ఆశీస్సుల కోసం పోటీ పడ్డారు. ఈ అద్భుతాన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా రావడంతో ఆ ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది.
అయితే ఈ విషయంపై సదరు వృద్ధురాలు స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు. తాను నదిలో నడిచిన చోట నీటి మట్టం చాలా తక్కువగా ఉందని, అక్కడ కేవలం మోకాళ్ల లోతు నీరు మాత్రమే ఉండటంతో నడవడం సాధ్యమైందని ఆమె స్పష్టం చేశారు. తనకు ఎలాంటి దైవశక్తులు లేవని, తాను కేవలం నర్మదా పరిక్రమ చేస్తున్న సాధారణ భక్తురాలినని ఆమె తెలిపారు. ఈ వాస్తవం తెలియడంతో అద్భుతం అని నమ్మిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.