భారత బ్యాటర్ల బ్యాట్లలో స్పెషల్ రబ్బర్ కోటింగ్, లంక ప్లేయర్ భానుక రాజపక్స సంచలన ఆరోపణలు

టీ20 క్రికెట్లో భారత బ్యాటర్ల పవర్ హిట్టింగ్ చూసి శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు వాడుతున్న బ్యాట్లు మిగతా జట్ల ఆటగాళ్లకు అందుబాటులో లేవని ఆయన ఆరోపించారు. భారత ఆటగాళ్లు ఉపయోగిస్తున్న బ్యాట్లపై ప్రత్యేకమైన రబ్బర్ పొర ఉంటుందని, అందుకే వారు అంత సులభంగా భారీ షాట్లు కొడుతున్నారని రాజపక్స పేర్కొన్నారు. ఈ రకమైన అడ్వాన్స్డ్ బ్యాట్లు తాము కొనుగోలు చేద్దామన్నా దొరకవని, ఇది భారత జట్టుకు అదనపు బలాన్ని ఇస్తోందని ఆయన ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఐసీసీ నిబంధనల ప్రకారం బ్యాట్లపై ఎలాంటి రబ్బర్ కోటింగ్ లేదా అదనపు పొరలు ఉండకూడదు. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియా దూకుడుగా ఆడుతూ వరుసగా 200 నుంచి 250 పైగా పరుగులు సాధిస్తోంది. భారత బ్యాటర్ల ఆధిపత్యం వెనుక బ్యాట్ల మాయాజాలం ఉందన్న రాజపక్స ఆరోపణలు ఇప్పుడు క్రీడా లోకంలో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే టీమ్ ఇండియా అత్యధిక విజయాలు సాధిస్తూ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఓటమి భయంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.