డీజే ఆపేశారని ఆగ్రహం! బంధువులపైకి కారు పోనిచ్చి ముగ్గురిని చంపిన యువకుడు

ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో జరిగిన ఓ వివాహ వేడుకలో డీజే ఆపేయాలన్న విషయమై మాటా మాటా పెరిగి ఘోరం జరిగింది. పెళ్లి కొడుకు బంధువుల మరుదుల వరుస అయిన కౌశల్ యాదవ్ తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన ఇకో కారును బంధువుల మీదికి పోనిచ్చాడు. ఈ దారుణ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో వరుడి మేనమామలు ఇద్దరు, ఒక బాబాయ్ ఉన్నారు. ముందుగా మాటమాట పెరిగి, ఆపై ఘర్షణ జరగడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఈ దారుణ దృశ్యం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. నిందితుడు కౌశల్ యాదవ్ కారును ముందుగా జనాలపైకి పోనిచ్చి, ఆపై రివర్స్ చేసి కూడా తొక్కించినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఘటన తర్వాత నిందితుడు తన తండ్రితో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ఇప్పటికే హత్య కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘోరంతో పెళ్లింట విషాద ఛాయలు అలముకున్నాయి.