హుజురాబాద్‌లో కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ సమరభేరి

హుజురాబాద్‌లో కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ సమరభేరి

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం హుజురాబాద్ పట్టణం అట్టుడికిపోయింది. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించిన కార్యకర్తలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు నేతృత్వంలో భారీ ర్యాలీగా వెళ్లిన నాయకులు, ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ప్రజలను విస్మరించిందని బీజేపీ నేతలు మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఊసే లేదని, పెట్టుబడి సాయం అందక రైతులు అప్పుల పాలవుతున్నారని ధ్వజమెత్తారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తోందని వారు విమర్శించారు.

హుజురాబాద్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, వీధి దీపాలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో యంత్రాంగం విఫలమైందని నిరసనకారులు ఆరోపించారు. ముఖ్యంగా జనావాసాల మధ్య డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, రెండో విడత దళిత బంధు నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్ సహా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *