వాహనం విక్రయించినా రికార్డుల్లో పేరు మార్చకుంటే ప్రమాద పరిహారానికి పాత యజమానే బాధ్యుడు అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

వాహనాన్ని విక్రయించినప్పటికీ రవాణా శాఖ రికార్డుల్లో యాజమాన్యం పేరు మార్చకపోతే, ఆ వాహనం వల్ల జరిగే ప్రమాదాలకు పాత యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ సందీప్ జైన్ ఈ మేరకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ దాఖలు చేసిన అప్పీలును కొట్టివేస్తూ కీలక తీర్పునిచ్చారు. 2015లో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మరణించగా, వాహనం అమ్మేసినందున తమకు సంబంధం లేదని బీమా కంపెనీ వాదించింది. అయితే ప్రమాద సమయంలో ఆర్టీవో రికార్డుల్లో పాత యజమాని పేరే ఉండటంతో, కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది.
సుప్రీంకోర్టు గత తీర్పులను ఉటంకిస్తూ, బాధితులు అసలు యజమాని కోసం వెతకాల్సిన అవసరం లేదని, రికార్డుల ప్రకారం నమోదైన యజమాని మరియు బీమా కంపెనీయే పరిహారం చెల్లించాలని కోర్టు పేర్కొంది. వ్యక్తిగత వాహన డ్రైవర్లు తప్పనిసరిగా బీమా రక్షణలో ఉండాలని, ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ఇది యజమాని బాధ్యత అని కోర్టు గుర్తు చేసింది. ఈ మేరకు మృతుడి కుటుంబానికి వడ్డీతో కలిపి మొత్తం రూ. 17,94,718 చెల్లించాలని ఆదేశించింది. వాహనం అమ్మిన వెంటనే పేరు మార్పిడి ప్రక్రియ పూర్తి చేయకపోతే పాత యజమానులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ తీర్పు హెచ్చరిస్తోంది.