వాట్సాప్ మెసేజ్తో అరెస్టు సమాచారం చెల్లుతుందా కేరళ హైకోర్టు సంచలన తీర్పు

మత్తు పదార్థాల కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరిస్తూ కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడి అరెస్టుకు గల కారణాలను వాట్సాప్ సందేశం ద్వారా బంధువులకు తెలియజేయడాన్ని చట్టబద్ధమైన నిబంధనల అమలుగానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. ఎన్.డి.పి.ఎస్ చట్టం కింద 96 గ్రాముల ఎండీఎంఏతో పట్టుబడిన షమీమ్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ ఈ మేరకు తీర్పునిచ్చారు.
పోలీసులు నిందితుడి బంధువును నేరుగా రమ్మని కోరినప్పటికీ ఆయన నిరాకరించడంతో వాట్సాప్ ద్వారా సమాచారం పంపారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) మరియు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 47 ప్రకారం నిందితుడికి ఉండే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించలేదని కోర్టు అభిప్రాయపడింది. అరెస్టు కారణాలను లిఖితపూర్వకంగా లేదా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సకాలంలో చేరవేయడం సరైన ప్రక్రియేనని న్యాయస్థానం ఈ సందర్భంగా తేల్చి చెప్పింది.