వంటగ్యాస్ కొరతపై కేంద్రం సంచలన ప్రకటన

దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు తీపి కబురు అందించింది. గృహ వినియోగదారులకు 100 శాతం ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను నిరంతరాయంగా కొనసాగిస్తామని ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తగినంత గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని కేంద్రం ప్రకటించింది.
ఇరాన్, అమెరికా మరియు ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్ ధరలు పెరుగుతాయని, కొరత ఏర్పడుతుందని ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధి వద్ద భారతీయ నౌకలు సురక్షితంగా ఉన్నాయని, దిగుమతులకు ఎటువంటి ఆటంకం లేదని ప్రభుత్వం వివరించింది. ముందస్తు భయంతో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూ కట్టాల్సిన అవసరం లేదని సూచించింది.
అవసరం లేకపోయినా ఆందోళనతో గ్యాస్ బుక్ చేయవద్దని, దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. గ్యాస్ ఉత్పత్తిని మరింత పెంచాలని ఇప్పటికే చమురు కంపెనీలను కేంద్రం ఆదేశించింది. పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని, వంటగ్యాస్ పంపిణీ యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.