లిక్కర్ కేసులో సీబీఐకి ఎదురుదెబ్బ అరవింద్ కేజ్రీవాల్కు బిగ్ రిలీఫ్

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మరియు ఇతరులకు ఢిల్లీ హైకోర్టు సోమవారం ఉపశమనం కలిగించింది. గతంలో ట్రయల్ కోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించడానికి కోర్టు సమయం మంజూరు చేసింది. ఈ పిటిషన్పై తమ వాదనలు వినిపించడానికి సమయం కావాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కోరగా, సీబీఐ వ్యతిరేకించినప్పటికీ న్యాయస్థానం వారి అభ్యర్థనను అంగీకరించింది.
2026 ఫిబ్రవరిలో రౌస్ ఎవెన్యూ కోర్టు కేజ్రీవాల్, సిసోడియా, కల్వకుంట్ల కవితతో పాటు మరో 23 మందిని ఈ కేసులో నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే, ఈ తీర్పు చట్టవిరుద్ధమని పేర్కొంటూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా హైకోర్టు ఈ కేసు విచారణను వాయిదా వేస్తూ, నిందితులందరూ తమ కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించింది.
మరోవైపు, ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ మార్చాలని కేజ్రీవాల్ గతంలో చేసిన విన్నపాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించారు. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం ఆ పిటిషన్ అక్కడ పెండింగ్లో ఉంది. గతంలో జస్టిస్ శర్మ తన బెయిల్ పిటిషన్ను తిరస్కరించినందున, ఆమెపై తనకు నమ్మకం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ న్యాయపోరాటం కొనసాగుతుండగా, హైకోర్టు తాజాగా ఇచ్చిన గడువు కేజ్రీవాల్ బృందానికి ఊరటనిచ్చింది.