రోహిత్ కోహ్లీ ఫ్యాన్స్కు పండగే 2027 వరల్డ్ కప్ ముందు రికార్డుల వేట

భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు బీసీసీఐ తీపి కబురు అందించనుంది. 2027 వన్డే ప్రపంచ కప్ను లక్ష్యంగా చేసుకున్న ఈ ‘రో-కో’ జోడీ, మెగా టోర్నీకి ముందు భారీ సంఖ్యలో వన్డే మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి విరామం తీసుకున్న వీరు, ప్రస్తుతం వన్డేలపైనే పూర్తి దృష్టి సారించారు. దీనికి అనుగుణంగా టీమ్ ఇండియా అంతర్జాతీయ షెడ్యూల్లో మరిన్ని అదనపు వన్డే సిరీస్లు చేరే అవకాశం కనిపిస్తోంది.
ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP) ప్రకారం నిర్ణయించిన మ్యాచ్లతో పాటు, భారత్తో అదనపు వన్డేలు ఆడేందుకు శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ క్రికెట్ బోర్డులు బీసీసీఐని సంప్రదించాయి. ముఖ్యంగా ఐర్లాండ్ 3 వన్డేల సిరీస్ కోసం పట్టుబడుతుండగా, బీసీసీఐ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అలాగే అక్టోబర్-నవంబర్లో న్యూజిలాండ్ పర్యటనలోనూ అదనపు వన్డేలు చేర్చేలా చర్చలు జరుగుతున్నాయి.
వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న వన్డే ప్రపంచ కప్కు ముందు ఈ అదనపు మ్యాచ్లు రోహిత్, కోహ్లీలకు సరైన ప్రాక్టీస్గా మారనున్నాయి. వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ల మధ్యలో ఈ వన్డేలు తోడైతే, అభిమానులకు పండగే అని చెప్పాలి. కేవలం వన్డే ఫార్మాట్కే పరిమితమైన ఈ దిగ్గజాలు మరిన్ని రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.