రాష్ట్రంలో కొత్తగా 70 బార్లు – ఆదాయ వృద్ధికి ఎక్సైజ్ శాఖ కొత్త ప్రణాళిక!

రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 70 బార్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ముఖ్యంగా, అధిక ఆదాయం వచ్చే ప్రాంతాలను గుర్తించి అక్కడే కొత్త లైసెన్స్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,171 బార్లు పనిచేస్తుండగా, వాటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోనే ఉన్నాయి.
ఇక మద్యం ప్రియులకు మరింత విభిన్న అనుభవం అందించేందుకు మైక్రోబ్రూవరీల సంఖ్యను పెంచే అవకాశమున్నట్లు సమాచారం. వీటి ద్వారా ప్రత్యేక రుచులకున్న కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఉంది. కొత్త బార్ల ఏర్పాటుపై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినప్పటికీ, ఎక్సైజ్ శాఖ ఈ ప్రణాళికను త్వరలో అమలు చేసే అవకాశముంది. ఈ నిర్ణయం వ్యాపార వర్గాలను ఆనందింపజేస్తున్నా, మద్యం వ్యసనాన్ని పెంచే ప్రమాదం ఉందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.