రాజకీయాలు వదిలి వ్యవసాయంలో పడ్డ విజయసాయిరెడ్డి అసలు ప్లాన్ ఏంటి

వైఎస్సార్సీపీ హయాంలో చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు రూటు మార్చారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన తన సొంత జిల్లా నెల్లూరులోని శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో బిజీగా గడుపుతున్నారు. తాజాగా అక్కడ ఆయన సేంద్రియ వ్యవసాయం చేస్తూ కనిపించారు. గోమూత్రం, వేపాకులు, వెల్లుల్లి, మిరపకాయలతో తయారు చేసిన ‘అగ్నాస్త్రం’ అనే ద్రావణాన్ని స్వయంగా పంట పొలాలకు స్ప్రే చేస్తున్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అయితే విజయసాయిరెడ్డి ఈ హఠాత్తు నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. మధ్యలో ఏపీ మద్యం స్కాంలో సీఐడీకి వాంగ్మూలం ఇచ్చిన ఆయన, తిరిగి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. కానీ సీఐడీ తనను కూడా నిందితుడిగా చేర్చడంతో ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారు. పార్టీలో సజ్జల వర్గం హవా కొనసాగుతున్నందున జగన్ దగ్గర మళ్ళీ ఎంట్రీ దొరకడం కష్టమని భావించి ఆయన ఇలా వ్యవసాయం బాట పట్టినట్లు తెలుస్తోంది.
మరోవైపు విజయసాయిరెడ్డి ఈ మధ్య హిందూత్వ వాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. మతమార్పిడులకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తూ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. వైసీపీలో స్థానం దక్కకపోవడంతో తన భవిష్యత్ కార్యాచరణలో భాగంగానే ఆయన ఈ కొత్త వేషధారణతో ప్రజల ముందుకు వస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.