మొదటి రాత్రి అజ్మీర్ దర్గాకు వెళ్తామన్న భార్య అసలు రూపం బయటపడటంతో వరుడు షాక్

రాజస్థాన్లోని అజ్మీర్ కమలా బావడి ప్రాంతానికి చెందిన ప్రమోద్ కుమార్ వివాహం పేరుతో ఘోర మోసానికి గురయ్యారు. పెళ్లి కావడం లేదనే ఆందోళనలో ఉన్న ప్రమోద్కు మనీషా అనే మహిళా దళారీ పరిచయమైంది. ఉత్తరప్రదేశ్కు చెందిన పేద యువతి చాందినీతో వివాహం చేస్తానని నమ్మించి ఆమె ప్రమోద్ నుండి అక్షరాలా 1.80 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఆర్య సమాజ్ ఆలయంలో నిరాడంబరంగా పెళ్లి జరిగిన తర్వాత మొదటి రోజే తన అసలు రంగు చూపించింది ఆ కిలేడీ పెళ్లికూతురు. మొదటి రాత్రి కడుపునొప్పి అని నాటకమాడి మరుసటి రోజు మొక్కు చెల్లించుకోవడానికి అజ్మీర్ దర్గాకు వెళ్లాలని భర్తను కోరింది.
భార్య మాటలు నమ్మిన ప్రమోద్ ఆమెను దర్గాకు తీసుకువెళ్లగా అక్కడ జనం రద్దీని ఆసరాగా చేసుకుని చాందినీ పరారైంది. మోసపోయానని గ్రహించిన ప్రమోద్ వెంటనే గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఏఎస్ఐ రాకేష్ సింగ్ దర్యాప్తు ప్రారంభించి ఇదొక అంతర్రాష్ట్ర ముఠా పనిగా అనుమానిస్తున్నారు. పెళ్లి పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఈ మహిళా దళారీ మనీషా మరియు చాందినీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.