మంత్రికి చేదు అనుభవం సీఎం వెళ్లే దారిలో మీకెందుకు అనుమతి

తెలంగాణ శాసనమండలి నూతన భవన ప్రవేశం వేళ మంత్రి దామోదర రాజనర్సింహకు భద్రతా సిబ్బంది నుంచి అనూహ్య అవరోధం ఎదురైంది. కౌన్సిల్ భవనంలోకి వెళ్తున్న మంత్రిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి వెళ్లే దారి ఇదని, మీరు వేరే మార్గంలో వెళ్లాలని సూచించడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
ఈ చర్యపై మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒక మంత్రిని ఆపడానికి మీరెవరు?” అంటూ భద్రతా సిబ్బందిపై మండిపడ్డారు. ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ సమక్షంలోనే ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేస్తూనే మంత్రి నేరుగా మండలి లోపలికి వెళ్లిపోయారు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మంత్రికి ఇలాంటి అనుభవం ఎదురుకావడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీగా ఉన్న భవనాన్ని సుమారు 30 కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ నూతన భవనంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు ‘తెలంగాణ తల్లి’ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వేడుకల సమయంలోనే మంత్రికి అవమానం జరగడం సంచలనం రేపింది.