పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం బంపర్ ఆఫర్ ఇక నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకే నగదు

ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. గత మూడేళ్లుగా ఎటువంటి లావాదేవీలు లేని పీఎఫ్ ఖాతాల్లో మిగిలిపోయిన వెయ్యి రూపాయల లోపు నగదును నేరుగా ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయాలని నిశ్చయించింది. దీని కోసం చందాదారులు ఎలాంటి దరఖాస్తులు లేదా క్లెయిమ్ ఫారాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఆటోమేటిక్ రీఫండ్ ప్రక్రియను పైలట్ ప్రాజెక్ట్ కింద కేంద్రం త్వరలో ప్రారంభించనుంది.
ప్రస్తుతం ఆధార్తో లింక్ అయి ఉన్న దాదాపు ఏడు లక్షల నిరుపయోగ ఖాతాలకు ఈ సదుపాయం తక్షణమే వర్తిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, సుమారు 25 లక్షల పాత ఖాతాలకు కూడా ఈ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న మొత్తాలు సులభంగా తిరిగి పొందే వీలుంటుంది. కార్మికులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఈ సాహసోపేతమైన అడుగు వేసింది.