నటుడి సూసైడ్ కేసు: CBI సంచలన నిర్ణయం!

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి రెండు దర్యాప్తులను మూసివేసినట్లు తాజా సమాచారం. ముంబై కోర్టుకు సమర్పించిన రిపోర్టుల్లో, సుశాంత్ మరణం వెనుక ఎటువంటి కుట్ర జరిగిందని నిర్ధారించే ఆధారాలు లభించలేదని పేర్కొంది. దీంతో, నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసు దర్యాప్తులో ఇది ఒక ముఖ్యమైన మలుపుగా మారింది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2020లో తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీనిపై అతని తండ్రి కేకే సింగ్ ఆగస్టులో రియా చక్రబర్తి సహా కొంతమందిపై కేసు పెట్టారు. వారంతా ఆర్థికంగా, మానసికంగా వేధించడంతోనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. అయితే, ఈ కేసులో కోర్టుకు సమర్పించిన తాజా రిపోర్టులతో అనేక ఊహాగానాలకు తెరపడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, సుశాంత్ మాజీ మేనేజర్ దిశ సలియన్ మృతి కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.