డైటింగ్ యాప్ పేరుతో దారుణం స్వలింగ సంపర్కం సాకుతో నిలువు దోపిడీ

ఆన్లైన్ డేటింగ్ యాప్ ‘గ్రైండర్’ వేదికగా ఒక వ్యక్తిని ట్రాప్ చేసి, దౌర్జన్యంగా డబ్బులు, మొబైల్ ఫోన్ దోచుకున్న ఘటన కరీంనగర్లో కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి కరీంనగర్ రూరల్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరొక మైనర్ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు రామల కృష్ణమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు జుమైర్ గ్రైండర్ యాప్ ద్వారా కృష్ణమూర్తిని సంప్రదించి, మసాజ్ మరియు స్వలింగ సంపర్కం కోసం ఆహ్వానించాడు. దీనిని నమ్మిన బాధితుడు రైలులో కరీంనగర్ చేరుకోగా, నిందితుడు తన బైక్పై అతన్ని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కృష్ణమూర్తిపై దాడి చేసి, ప్రాణాలతో చంపేస్తామని బెదిరించి అతని వద్ద ఉన్న రూ. 1,500 నగదు మరియు స్మార్ట్ఫోన్ను లాక్కున్నారు.
ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ నిరంజన్ రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టి, నిందితులు సయ్యద్ అబ్బాస్ మరియు మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్లను తిగలకుంటపల్లి వద్ద పట్టుకున్నారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన మొబైల్ మరియు నేరానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించినందుకు సీపీ గౌస్ ఆలం పోలీసు బృందాన్ని అభినందించారు. నిందితులను ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచారు.