డిప్యూటీ సీఎం ప్రయాణించిన విమానంలో బ్రేక్ ఫెయిల్ – తృటిలో ప్రమాదం తప్పింది
March 24, 2025

సిమ్లాలోని జుబ్బర్హట్టి విమానాశ్రయంలో సోమవారం (మార్చి 24) ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి సిమ్లాకు బయలుదేరిన అలయన్స్ ఎయిర్ 91821 విమానం ల్యాండింగ్ సమయంలో బ్రేక్లో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి, వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించాడు. అత్యవసర ల్యాండింగ్ నిర్ణయం తీసుకుని, ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. విమానం సగం రన్వేపై నిలిచిపోయింది.
ఈ విమానంలో హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముఖేష్ అగ్నిహోత్రి, డీజీపీ కూడా ప్రయాణిస్తున్నారు. ఘటన తర్వాత ప్రయాణికులు దాదాపు 30 నిమిషాల పాటు విమానంలోనే ఉండాల్సి వచ్చింది. అధికారులు విచారణ చేపట్టారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు. విమానాశ్రయ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేసి, విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు వెల్లడించారు.