టిఫిన్ తింటుండగా గుండెపోటుతో కుప్పకూలిన 20 ఏళ్ల యువకుడు, ఒకే ఒక్క కొడుకు మరణంతో శోకసముద్రంలో తల్లిదండ్రులు

మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ ప్రాంతంలో పరస్ అలియాస్ కేశు అనే 20 ఏళ్ల యువకుడు టిఫిన్ తింటూ అకస్మాత్తుగా మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఆహారం తీసుకుంటున్న సమయంలో అతనికి ఒక్కసారిగా గుండె, కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే కేశు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కళాశాలలో చదువుకుంటూనే తన తల్లికి వస్త్ర వ్యాపారంలో సాయం చేసే ఆ యువకుడి మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని ఆరోగ్యవంతుడైన యువకుడు ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం ‘సైలెంట్ ఎటాక్’ అయ్యుంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో యువతలో పెరుగుతున్న ఇటువంటి మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తమకున్న ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే ప్రాణాలు వదలడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ మృతికి గల ఖచ్చితమైన కారణాలను వెలికితీయాలని మృతుని బంధువులు కోరుతున్నారు.