జీతాల కోసం అసెంబ్లీ ముట్టడికి ఆశా కార్యకర్తల సిద్ధం

తల్లాడ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సోమవారం ఆశా కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు సత్తెనపల్లి నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలను పర్మనెంట్ చేస్తూ నెలకు 18 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. ప్రజారోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడ్డారు. ఎలాంటి గుర్తింపు కార్డులు, అదనపు వేతనం ఇవ్వకుండానే ఎన్నికల సర్వేల వంటి పనులకు వాడుకుంటున్నారని ఆరోపించారు. పనిభారం తగ్గించాలని, సెలవు రోజుల్లో వేతనంతో కూడిన పని కల్పించాలని, పని చేసే చోట తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు ఉండాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్ సమావేశాల్లో తమ సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ‘చలో హైదరాబాద్’ పిలుపునిచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ నెల 16, 17 తేదీల్లో సమ్మెకు వెళ్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ ప్రత్యూషకు నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు టి.రాణి, జి.దేవకరణ్, పి.నాగమణి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.