గోల్కొండ జోన్లో కమిషనర్ మెరుపు తనిఖీ అధికారులకు కీలక ఆదేశాలు

నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డితో కలిసి సోమవారం గోల్కొండ జోన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు భగత్ సింగ్ జంక్షన్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మరియు ఇందిరమ్మ క్యాంటీన్ను క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
వాహనదారులకు ఇబ్బంది కలగకుండా రోడ్లపై ఉన్న గుంతలను యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. నగర సుందరీకరణలో భాగంగా అబిడ్స్ జంక్షన్లోని పచ్చదనాన్ని కాపాడటంతో పాటు, డివైడర్లు మరియు ఖాళీ ప్రదేశాల్లో కొత్త మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తూ పలు కీలక సూచనలు చేశారు.
ముఖ్యంగా ప్రజారోగ్యం దృష్ట్యా పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై కమిషనర్ అసహనం వ్యక్తం చేస్తూ, వాటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని హెచ్చరించారు. రాబోయే ఉగాది పండుగ నాటికి కమ్యూనిటీ హాల్ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. రాంకీ సంస్థ ప్రతినిధులతో కలిసి పాదయాత్ర చేస్తూ చెత్త సేకరణ కేంద్రాలను పరిశీలించిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.