క్రిస్ గేల్ రికార్డుపై కన్నేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే 14 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ ఆటగాడు ఈసారి రెండు ప్రధాన లక్ష్యాలతో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాడు. రాజస్థాన్ రాయల్స్కు ఐపీఎల్ ట్రోఫీని అందించడంతో పాటు, లెజెండరీ క్రికెటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలు కొట్టడమే తన టార్గెట్ అని వైభవ్ స్పష్టం చేశాడు.
బీహార్కు చెందిన వైభవ్, కేవలం 13 ఏళ్ల వయసులోనే రూ.1.10 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరి చరిత్ర సృష్టించాడు. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా, ఇటీవల జరిగిన అండర్-19 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఇంగ్లాండ్పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్ను ఆరోసారి ఛాంపియన్గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు.
తాజాగా బీసీసీఐ నమన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న వైభవ్ తన మనసులోని మాటను పంచుకున్నాడు. “నేను విమర్శలను అస్సలు పట్టించుకోను, నా ఆటపైనే దృష్టి పెడతాను. ఐపీఎల్ 2026లో మా జట్టుకు కప్పు అందించడమే నా మొదటి ప్రాధాన్యత” అని తెలిపాడు. ఐపీఎల్లో క్రిస్ గేల్ నెలకొల్పిన 175 పరుగుల రికార్డును అధిగమించే సత్తా ఈ యువ కిశోరానికి ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. గత సీజన్లో 206.56 స్ట్రైక్ రేట్తో మెరిసిన వైభవ్, ఈసారి ఎలాంటి రికార్డులు తిరగరాస్తాడో వేచి చూడాలి.