కీసరలో రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ములు మృతి

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదగిరిపల్లిలో ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సర్వీస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గూడూరు చంద్రశేఖర్ (32), మత్స్యగిరి (27) అనే ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందారు. వీరితోపాటు శ్రీను అనే మరో వ్యక్తి కూడా ఉన్నారు. ముగ్గురూ కలిసి ఒకే బైక్పై బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు వారి బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మత్స్యగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ప్రమాదం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మత్స్యగిరికి మార్చి 20న వివాహం జరగాల్సి ఉండటంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కీసర ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.